- రూ.500 నోటు పోదు.. రూ.1000 నోటు రాదు.
ముంబయి: రూ.2000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ నోట్లన్నీ డిపాజిట్లు, మార్పిడి రూపంలో బ్యాంకులకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రూ.500 నోట్లను కూడ ఆర్బీఐ ఉపసంహరించుకుంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై గురువారం ఆర్బీఐ స్పష్టత నిచ్చింది. రూ.500 నోట్లను ఉపసంహరించుకోవడం లేదని, రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టడం వంటి ఆలోచన లేదని స్పష్టతనిచ్చింది. ఇటువంటి ఊహాగానాలను వ్యాప్తి చేయవద్దని పౌరులకు సూచించింది.
రూ. 2000నోట్లు 50శాతం వెనక్కి:
ఇటీవల ఉపసంహరించుకున్న రూ.2000 నోట్లలో 50శాతం ఇప్పటికే బ్యాంకులకు చేరినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. వీటి విలువ రూ.1.80 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే నోట్లన్నీ దాదాపు 85శాతం డిపాజిట్ల రూపంలోనే బ్యాంకు ఖాతాల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. వీటిని మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఉందని.. అయినప్పటికీ చివరి నిమిషం వరకూ వేచి ఉండవద్దని పౌరులకు సూచించారు. మార్పిడి చేసుకునేందుకుగాను ఆర్బీఐ దగ్గర ఇతర ఇతర కరెన్సీ ఉందని పేర్కొన్నారు. మరోవైపు. 2018 మార్చి 31 నాటికి గరిష్ఠంగా రూ.6.73 లక్షల కోట్ల మేర రూ.2.000 నోట్లు చలామణిలో ఉన్నట్లు అంచనా. అయితే, 2023 మార్చి 31 నాటికి కేవలం రూ.3.62 లక్షల కోట్లు మాత్రమే చాలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ అంచనా వేసింది. తాజాగా వీటిలో సగం ఇప్పటికే బ్యాంకులకు చేరిందని తెలిపింది. ఉపసంహరణ ప్రకటన చేసిన కేవలం 20 రోజుల్లోనే సగం నోట్లు వెనక్కి రావడం గమనార్హం.