హైదరాబాద్: బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో ఆహ్వానించారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి కూడా స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు మహముద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీలు సంతోష్ కుమార్, వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్తో పాటు పలువురు రాష్ట్రపతికి స్వాగతం పలికారు.
ద్రౌపది ముర్ము విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్భవన్కు చేరుకొని, రాత్రికి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు రీవ్యూయింగ్ ఆఫీసర్గా హాజరవుతారు. పరేడ్ అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లిపోతారు.