అనన్య న్యూస్, హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిష న్ రెడ్డి ఇందిరాపార్కు ధర్నా చౌక్లో బుధవారం చేపట్టిన దీక్షను పోలీసు లు రాత్రి భగ్నం చేశారు. నిరహార దీక్ష చేసేందుకు అనుమతి పొందిన సమయం ముగిసినందున దీక్షను విరమించాలని గాంధీనగర్ ఏసిపి రవికుమార్, దోమలగూడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలు కోరారు. అయితే దీక్ష చేసేందుకు 24 గంటల సమయం ఉందంటూ రేపు ఉదయం వరకూ దీక్షను కొనసాగిస్తానని కిషన్ రెడ్డి పోలీసులకు తెలిపారు. అయితే, దీక్ష చేసేందుకు సాయంత్రం 6 గంటల వరకూ మాత్రమే అనుమతి ఉందంటూ పోలీసులు ఎంత చెప్పిన రేపు ఉదయం వరకూ దీక్ష చేస్తానని కిషన్ రెడ్డి పట్టుబట్టారు. దీంతో రాత్రి 8 గంటలకు కిషన్ రెడ్డిని పోలీసు బలగాలతో అదుపులోకి తీసుకుని తరలించారు.
బిజెపి నాయకులు, కార్యకర్తలు పోలీసులను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినా కిషన్రెడ్డిని పోలీసులు అక్కడి నుంచి తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ కిషన్ రెడ్డి బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఇందిరాపార్కు ధర్నా చౌక్లో నిరహార దీక్ష చేపట్టారు. సాయంత్రం 6 గంటల తర్వాత అనుమతి గడువు పూర్తి కావడంతో పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. బిజెపి నాయకులు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈక్రమంలో పోలీసులకు, బిజెపి కార్యకర్తలకు తోపులాట జరగడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
అరెస్టు చేసిన కిషన్ రెడ్డిని పోలీసులు నాంపల్లి బిజెపి రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. ఆయన అక్కడ దీక్ష కొనసాగిస్తున్నారు. కిషన్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్ తీవ్రంగా ఖండించారు. నిరాహార దీక్షకు బిజెపి అన్ని అనుమతులు తీసుకుని ప్రశాంతంగా నిర్వహిస్తుండగా పోలీసులు భగ్నం చేయడంపై అగ్రహం వ్యక్తం చేశారు.