అనన్య న్యూస్, ఢిల్లీ: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని పార్టీ అధినాయకత్వం నియమించింది. మంగళవారం మధ్యాహ్నం బండి సంజయ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తర్వాత కొద్ది సేపటికే త్వరలో తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా పార్టీ హైకమాండ్ నియమించిం ది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును తొలగించి ఆయన స్థానంలో మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించింది. 2024లో జరగబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కిషన్ రెడ్డి ప్రస్థానమిది:
రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ లో స్వామిరెడ్డి, ఆండాళమ్మ దంపతులకు జన్మించిన కిషన్ రెడ్డి డిప్లొమా వరకు చదువుకున్నారు. 1977లో జనతాపార్టీలో ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన కిషన్ రెడ్డి 1980లో బీజేపీ స్థాపించిన తర్వాత పూర్తి స్థాయిగా రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన కిషన్ రెడ్డి. 2010 నుంచి 2014 వరకు బీజేపీ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా, 2014 నుంచి 2016 వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. అంబర్ పేట నుంచి ఎమ్మెల్యేగా, సికింద్రాబాద్ నుంచి ఎంపీగా సేవలందించారు. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్ పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిని చవి చూసిన కిషన్ రెడ్డి ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించారు. అనంతరం హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా క్యాబినెట్ హోదాలో పనిచేస్తున్నారు.