అనన్య న్యూస్, న్యూఢిల్లీ: అతడో కూలి డ్రగ్స్ కు బానిసయ్యాడు. నీలి చిత్రాలు చూసి, చిన్నారులను టార్గెట్ చేసుకొని అత్యాచారాలకు పాల్పడ్డాడు. అనేక మంది చిన్నారులను హతమార్చాడు. అయితే ఓ కేసులో అతడు పట్టుబడ్డాడు. దీంతో కోర్టు అతడిని దోషిగా తేల్చింది. అనేక మంది చిన్నారులపై అత్యాచారం చేసి చంపిన యూపీ వాసి సీరియల్ రేపిస్ట్ రవీందర్ కుమార్ను ఢిల్లీలోని రోహిణి కోర్టు శనివారం దోషిగా నిర్ధారించింది. దాదాపు 30 మంది చిన్నారులపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. నిందితుడు ఉత్తరప్రదేశ్లోని కాస్ గంజ్ నివాసి. అతను ఢిల్లీ ఎన్సీఆర్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో నేరాలకు పాల్పడ్డాడు. నిందితుడు మద్యం, డ్రగ్స్కు అలవాటు పడి మత్తులో నేరాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. పిల్లలకు మిఠాయిలు తినిపించి ప్రలోభపెట్టి అత్యాచారం చేసి చంపేవాడు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. 2008 నుంచి 2015 మధ్య అతను దాదాపు 30 మంది పిల్లలను చంపాడు. అతడు దారుణానికి ఒడిగట్టిన బాధితుల్లో ఓ చిన్నారి వయస్సు కేవలం రెండు సంవత్సరాలు కాగా.. అత్యధిక వయస్సు ఉన్న బాధితురాలి వయస్సు 12 సంవత్సరాలు. కాగా.. 2008లో 18 ఏళ్ల రవీంద్ర కుమార్ ఉపాధి కోసం ఉత్తరప్రదేశ్ లోని కాస్ గంజ్ నుంచి ఢిల్లీకి వచ్చాడు. తండ్రి ప్లంబర్ గా పనిచేస్తుండగా, తల్లి ఇంటి వద్ద పనిమనిషిగా పనిచేస్తోంది. అతడు కూడా కూలీ పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలో అతడు డ్రగ్స్ కు బానిసయ్యాడు.
రవీందర్ కుమార్ తన 18 ఏళ్ల వయస్సులో ఓ సారి సీడీ ప్లేయర్లో రెండు అశ్లీల చిత్రాలను మొదటిసారిగా చూసిన తరువాత అతడిలోని సీరియల్ రేపిస్ట్, హంతకుడు ఒక్క సారిగా మేల్కొన్నాడు. అప్పటి నుంచి అతడు అత్యాచారం, హత్యలు చేయడం ప్రారంభించాడు. అలసిపోయిన కూలీలు సాయంత్రం తిరిగి వచ్చి తమ మురికివాడల్లో నిద్రకు ఉపక్రమించిన వెంటనే తన వేట ప్రారంభించేవాడు. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి మధ్య పిల్లలను రూ.10 నోట్లు లేదా మిఠాయిలతో ప్రలోభపెట్టేవాడు. ఏకాంత భవనం లేదా ఖాళీ మైదానంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. తనను మళ్లీ వారు ఎక్కడ గుర్తిస్తారో అనే భయంతో వారిలో చాలా మంది పిల్లలను చంపేసేవాడు.
అయితే 24 ఏళ్ల వయసులో 2015లో మొదటి సారిగా అరెస్టయిన రవీందర్ కుమార్ తీహార్ జైలులో ఉన్నాడు. 2014లో ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, హత్యాయత్నం, శారీరకంగా వేధించడం వంటి కేసుల్లో ఢిల్లీ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ కేసులో అతడిని కోర్టు దోషిగా తేల్చింది. అతడిని శిక్షించాలని పోలీసులు కోర్టును కోరారు. రెండు వారాల్లో అతడికి శిక్ష ఖరారు కానుంది.