అనన్య న్యూస్, కర్నూల్: శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్డులో టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో అనేక మందికి తీవ్రగాయాలు కాగా పదిమందికి కాళ్లు,చేతులు విరిగినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. దీంతో గాయపడిన వారిని వెంటనే పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం కొత్తగూడెం నుంచి శ్రీశైలం బస్సు వెళుతుండగా శ్రీశైలం – దోర్నాల నల్లమల ఘాట్ రోడ్లోని చిన్నారుట్ల సమీపంలోని దయ్యాల టర్నింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
కాగా ప్రమాద సమయంలో బస్సులో ఇరవై మంది ప్రయాణికులు ఉన్నారని తెలిసింది. ఘాట్రోడ్డులో ప్రమాదం జరగడంతో సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయి. పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. అందుకున్న108 సిబ్బంది గాయపడిన వారిని శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శ్రీశైలం ఘాట్ రోడ్డులోని సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్ రోడ్డులో వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం పోలీసులు ట్రాఫిక్ జామ్ క్లియర్ చేస్తున్నారు.
బస్సు డ్రైవర్ మలుపులను అంచనా వేయకుండా అతి వేగంగా రావడమే బస్సు ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో గతంలోను చాలాసార్లు ప్రమాదాలు జరిగిన అధికారులు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవడంలేదని భక్తులు మండిపడుతున్నారు.