Monday, March 24, 2025

నకిలీ ఇన్సూరెన్స్ తయారీ ముఠా గుట్టురట్టు..

  • వాహనాల నకిలీ ఇన్సూరెన్స్‌, ఆర్సీ, డ్రైవింగ్‌ లైసెన్సుల తయారీ

అనన్య న్యూస్, గద్వాల: ఆర్టీఐ ఏజెంట్లుగా చలామణి అవుతూ నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఇన్సూరెన్స్‌ కంపెనీలు, ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేసిన ముఠాను పోలీసులు పట్టుకున్న ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. గద్వాలలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఎస్పీ సృజన వివరాలు వెల్లడించారు. ముఠాలో ముఖ్యుడిగా ఉన్న మీసాల రామస్వామి ఇది వరకు ఏపీలోని కర్నూల్‌లో ఆర్టీఐ ఏజెంట్‌గా పనిచేశాడు. దీంతో కంప్యూటర్‌పై కొంతమేర పరిజ్ఞానం ఉండడంతో తక్కువ సమయంలో ఎక్కు వ మొత్తంలో డబ్బులు సంపాదించాలన్న అత్యాశ ఉండేది. ఈక్రమంలో దేశీయ, విదేశీ ఇన్సూరెన్స్‌కు చెందిన వివిధ కంపెనీల లోగోలను డౌన్‌లోడ్‌ చేసుకొని, నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసి రెండు తెలుగు రాష్ర్టాల్లో చలామణికి తెరతీశాడు.

కర్నూల్‌, నంద్యాల, అనంతపూర్‌, తెలంగాణలోని జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, వనపర్తి జిల్లాల్లో ఏజెంట్లను నియమించుకొని వాహనాల విలువ మేరకు ఒక్కొక్కరి వద్ద రూ.వెయ్యి నుంచి రూ.4వేల వరకు డబ్బులు వసూలు చేసేవాడు. వచ్చిన ఆదాయంలో 50శాతం మేరకు సమాన వాటా ఏజెంట్లకు చెల్లించేవాడు. వాహనాలకు కావాల్సిన ఫిట్‌నెస్‌, ట్రాన్స్‌పోర్టు పర్మీషన్లకు, ఆర్సీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు సైతం నకిలీ పత్రాలు తయారు చేస్తూ రోజురోజుకూ విస్తరిస్తూ వచ్చాడు. అటు ఇన్సూరెన్స్‌ కంపెనీలను, ఇటు ప్రభుత్వాన్ని, ప్రజలను నిలువు దోపిడీ చేస్తూ ఈ రంగంలో ఆరితేరిపోయాడు. నకిలీ ధ్రువపత్రాల దందా పెద్ద మొత్తంలో సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు అలంపూర్‌ సీఐ సూర్యానాయక్‌, ఉండవెల్లి ఎస్సై బాలరాజు, సిబ్బంది బుధవారం సాయంత్రం కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో కర్నూల్‌ జిల్లాకు చెందిన రామస్వామి కీలకమని గుర్తించి అతడిని పూర్థిస్థాయిలో విచారించారు.

అతడితోపాటు గద్వాల, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, నల్లగొండతోపాటు ఏపీలోని నంద్యాల, కర్నూల్‌ ఇతర ప్రాంతాలకు చెందిన దాదాపు 17 మందిపై కేసు నమోదు చేశారు. ఉండవెల్లి పీఎస్‌లో సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను పట్టుకున్నారు. ఏ-1గా మీసాల రామస్వామితోపాటు చంద్రకుమార్‌, రవికుమార్‌, మాధవస్వామి, శ్రీకాంత్‌, సుధాకర్‌, తెలుగు విశ్వనాథ్‌, తెలుగు మధుసూదన్‌, రంగన్న, షఫీ, కోళ్ల ప్రేమ్‌కుమార్‌, పొత్తిలి సురేశ్‌గౌడ్‌, బోయిని నగేశ్‌, కొట్ర లక్ష్మయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘునాథ్‌, దాసరి ప్రవీణ్‌ను అరెస్టు చేశారు. వీరి నుంచి కారు, రెండు కలర్‌ ప్రింటర్లు, నకిలీ ఆర్సీలు, ఇన్సూరెన్స్‌ ధ్రువపత్రాలు, నకిలీ స్టాంపులు, 17 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిని రిమాండ్‌ కోసం అలంపూర్‌ కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. మీడియా సమావేశంలో డీఎస్పీ రంగస్వామి, సీఐ సూర్యానాయక్‌, ఎస్సైలు మహేందర్‌, బాలరాజు, నరేశ్‌, శేఖర్‌రెడ్డి, వెంకటస్వామి, కుర్మన్న, సిబ్బంది పాల్గొన్నారు.

Ananya News
Ananya Newshttps://ananyanews.in
Ananya News is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular