హైదరాబాద్, అనన్య న్యూస్: భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాల ఆన్లైన్ బుకింగ్ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని బస్ భవన్లో భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం బిజినెస్ హెడ్ (లాజిస్టిక్స్) పి. సంతోష్ కుమార్ నుంచి రూ.116 తీసుకొని తొలి బుకింగ్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ శ్రీరామ నవమి సందర్భంగా ఈ ఏడాది కూడా భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించిందనీ గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేసేందుకు సన్నద్దమవుతోందన్నారు. తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ కార్గో పార్శిల్ కేంద్రాల్లో రూ.116 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందనీ, శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అనంతరం ఈ తలం బ్రాలను భక్తులకు టీఎస్ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుందన్నారు.
భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉందనీ, నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా కల్యాణంలో ఉపయోగిస్తున్నారని అన్నారు. విశిష్టమైన ఆ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని గత ఏడాది టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది. తమ సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్ చేసుకున్నారు. గత ఏడాది దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రాలను అందజేశాం. తద్వారా రూ.71 లక్షల రాబడి వచ్చింది. గత ఏడాది డిమాండ్ దృష్ట్యా ఈ శ్రీరామ నవమికి భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ తలంబ్రాలను కోరుకునే భక్తులకు అందజేయబోతున్నాం. ఈ సారి రాములోరి కల్యాణంతో పాటు 12 ఏళ్లకో సారి నిర్వహించే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరగనుందని అన్నారు. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగ ఫోన్ నంబర్లు 9177683134, 7382924900, 9154680020 లను సంప్రదించాలన్నారు.