అనన్య న్యూస్, హైదరాబాద్ : సైబర్ నేరాలను అరికట్టడం, సైబర్ సేఫ్టికీ చర్యలు తీసుకోవడంలో తెలంగాణ పోలీస్ దేశంలోనే ముందంజలో ఉందని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం కౌన్సిల్, డిజిటల్ ఇండియా సంయుక్తంగా సైబర్ సెక్యూరిటీ -2023 అనే అంశంపై న్యూఢిల్లీ నుంచి ఆన్లైన్ ద్వారా నిర్వహించిన సదస్సులో డీజీపీ పాల్గొన్నారు. నేషనల్ అర్కిటెక్చర్ ఫర్ సైబర్ స్పేస్ మేనేజ్మెంట్ బై స్టేట్ గవర్నమెంట్ అనే అంశంపై ఆయన మాట్లాడారు. byy సైబర్ నేరాలను దర్యాప్తు చేసి, వాటిని అరికట్టేందుకు సైబర్ సేప్టీ బ్యూరో ను ఏర్పాటుచేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ తో సహా ప్రపంచంలోని దాదాపు 600 ప్రముఖ ఐటీ కంపెనీలు హైదరాబాద్లో ఏర్పాటయ్యాయని ఇందులో 10 లక్షల మంది ఐటీ ఆధారిత ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ ఇక్కడ ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ తోపాటు పరిసర ప్రాంతాల్లో సైబర్ లిటరేట్స్ గణనీయంగా ఉన్నారని వివరించారు. అయితే, ప్రపంచ వ్యాప్తం గా జరుగుతున్నా మాదిరిగానే సైబర్ నేరాలు రాష్ట్రంలో పెరిగాయని అన్నారు.
సైబర్ సెక్యూరిటీ లో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని వెల్లడించారు. బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ బ్యూరోలో 500 మంది అధికారులు, సిబ్బందిని నియమించామని వివరించారు. సైబర్ నేరాలను నియంత్రించేందుకై ఇప్పటికే ఏర్పాటు చేసిన తెలంగాణా సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కీలక పాత్ర వహిస్తోందని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లను ఏర్పాటు చేశామని, టోల్ ఫ్రీ నెంబర్ 1930, 100 ల ద్వారా సైబర్ నేరాల ఫిర్యాదులను నమోదు చేస్తున్నామని తెలిపారు. సైబర్ ఆధారిత ఆర్థిక నేరాలకు సంబంధించి రూ. 65 కోట్లను నిలిపివేశామని అన్నారు. పెరుగుతున్న సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని 800 పోలీస్ స్టేషన్లలో సైబర్ క్రైమ్ లు ఎదుర్కొనేందుకు పోలీస్ ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సైబర్ వారియర్లుగా తయారు చేశామని డీజీపీ వెల్లడించారు.