అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఆసక్తికర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేయడం, కాంగ్రెస్ కు ఓటేస్తే అధికారంలోకి వచ్చేది కేసీఆర్ అని ప్రకటించడం రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చకు కారణమైంది అంతేకాకుండా తాజాగా మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ నుంచి 25 కోట్లు తీసుకొని ఎన్నికలలో ఖర్చు చేసిందని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ కు చాలెంజ్ చేయడంతో ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీపై పదే పదే చేస్తున్న ఆరోపణలతో రేవంత్ రెడ్డి దానికి సమాధానంగా ఈటల రాజేందర్ బిజెపికి ఇష్టమైన భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర తడిబట్టలతో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసిరారు.
దీంతో తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య తాజా పరిణామాలతో యుద్ధం జరుగుతుంది. దీంతో బిఆర్ఎస్ ను పక్కకు నెట్టేసి రెండు పార్టీలు ఈ విషయాన్ని హైలెట్ చేసుకోవడం కావాలని ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నట్టు చర్చ జరుగుతుంది. తెలంగాణ రాజకీయాలలోకి బీఆర్ఎస్ పేరు రాకుండా బిజెపి, కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే కొత్త విషయాన్ని తెర మీదకు తీసుకువచ్చి రాజకీయాలను మారుస్తున్నారని చర్చ కూడా జరుగుతుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా పరిస్థితులు మారితే, జనాలకు కూడా ఈ రెండు పార్టీల పైన దృష్టి పడుతుందని భావిస్తున్నట్టు సమాచారం.
అందుకే మునుగోడు ఉపఎన్నిక ఎప్పుడో జరిగితే ఇప్పుడు ఆ విషయం మీద ఆరోపణలు చేసుకుంటూ ఈ రెండు పార్టీలు యుద్ధం మొదలు పెట్టాయి. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి, బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు నడుస్తుంది. అయితే దానిని ద్విముఖ పోటీ చేయాలని బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తామే ఉండాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తామే ఉండాలని బిజెపి నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. త్రిముఖ పోరు ఉంటేనే తమకు కలిసొస్తుందని బిఆర్ఎస్ భావిస్తుంది. కానీ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ ను టార్గెట్ చేయాల్సిన చోట ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం వెనుక మతలబు కచ్చితంగా ఉంటుందని, లేకుంటే ఈటల రాజేందర్ ఇప్పుడు ఇటువంటి ఆరోపణలు చెయ్యరు అని చర్చ జరుగుతుంది.