అనన్య న్యూస్, నాగర్ కర్నూల్: రాష్ట్రంలో ధరణి పోర్టల్ ని ఎత్తేస్తే రాజ్యమేలేది దళారులే అని సీఎం కేసీఆర్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మంగళవారం సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం జిల్లా కేంద్రంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం ఏం అభివృద్ధి జరిగిందో ప్రజలు గుర్తు చేసుకోవాలని సూచించారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో 5 మెడికల్ కాలేజీ మంజూరు చేశామని తెలిపారు.
ధరణి వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. ఓ కాంగ్రెస్ నాయకుడు తాము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామంటున్నాడని ఎద్దేవా చేశారు. ధరణి లేకపోతే అకౌంట్లో డబ్బులు పడవని తెలిపారు రాష్ట్రాన్ని దోచుకోవడానికి ధరణి పోర్టల్ ను ఎత్తివేయడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ధరణి లేని కాలంలో లంచం ఇవ్వకపోతే పని కాకపోయేదని కానీ రైతులకు ఇప్పుడు ఆ పరిస్థితి బాధలు లేవని, ధరణితో రాష్ట్రంలో 99 శాతం రైతుల భూ సమస్యలు పరిష్కారం అయ్యాయని వెల్లడించారు. గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి నేటి బిఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా తేడా ఉందని, ధరణి కాదు కాంగ్రెస్ నేతలను బంగాళాఖాతంలో కలిపేయాలని పిలుపునిచ్చారు. ఒకవేళ ధరణిని ఎత్తేస్తే రాజ్యమేలేది దళారులే అన్నారు.
తెలంగాణ రాకపోయి ఉంటే నాగర్కర్నూల్ జిల్లా కాకపోయేది. ఎస్పీ, కలెక్టరేట్ కార్యాలయాలు వచ్చేది కాదు. ఒకప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా వెనుకబాటు తనం ఉంది. ఇబ్బందులు ఉన్నాయి. సాగు, తాగునీటికి , కరెంట్కు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ అర్థం కావాలంటే పాలమూరు ఎంపీగా ఉండాలని నిర్ణయించుకున్నాను. జయశంకర్ సార్ సూచన మేరకు పాలమూరు ఎంపీగా పోటీ చేసి గెలుపొందాను. ఆ రోజు వాస్తవంగా పాలమూరు జిల్లాలో ఉద్యమం బలంగా లేకుండే. కానీ మీరు చూపించిన ఆదరణతో ఎంపీగా గెలిపించారు. ఉద్యమ చరిత్రలో పాలమూరు జిల్లా పేరు శాశ్వతంగా ఉంటుంది. ఈ జిల్లా ఎంపీగా ఉంటూనే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాను. ఈ జిల్లాను ఎప్పటికీ మరిచిపోను అని కేసీఆర్ స్పష్టం చేశారు.
అణగారిన దళిత జాతిని ఉద్దరించాలనే ఉద్దేశంతో ఎక్కడా లేని విధంగా కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి దళితబంధు ద్వారా ఆదుకుంటున్నాం అని కేసీఆర్ తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒక నాడు ముంబై బస్సులకు ఆలవాలం పాలమూరు. గంజి కేంద్రాలు వెలిసేవి. పాలమూరులో ఈ గంజి కేంద్రాలు ఏంటని ఏడ్చేవాళ్లం. గంజి కేంద్రాల పాలమూరు జిల్లాలో అవి మాయమయ్యాయి. పంట కొనుగోలు కేంద్రాలు వచ్చేశాయి. సంక్షేమ రంగంలో కూడా రూ. 50 వేల కోట్లు ఖర్చు పెడుతూ ముందున్నాం అని కేసీఆర్ తెలిపారు. ఈ రోజు బ్రహ్మాండంగా మిషన్ భగీరథ ద్వారా కృష్ణా నీళ్లు దుంకుతున్నాయి. ఐదు మెడికల్ కాలేజీలు వచ్చాయి. నాగర్కర్నూల్ మెడికల్ కాలేజీకి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. మహబూబ్నగర్, వనపర్తికి మంజూరు చేయగానే మీ ఎమ్మెల్యే నా దగ్గరికి వచ్చి మెడికల్ కాలేజీ కోరిండు. అప్పుడే ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి.. మెడికల్ కాలేజీ మంజూరు చేయించాం. ఐదు మెడికల్ కాలేజీలు పాలమూరు జిల్లాలోవ స్తాయనికలగన్నమా..? అని కేసీఆర్ ప్రశ్నించారు. చేతి వృత్తిదారులకు, బీసీ కులాలకు ప్రభుత్వం అందజేసే రూ.1 లక్ష సాయాన్ని జూన్ 9వ తేదీ నుంచి ప్రారంభస్తునట్లు తెలిపారు.