అనన్య న్యూస్, మహబూబ్ నగర్: టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మరో వ్యక్తిని శనివారం తెల్లవారుజామున సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని హైదరాబాదుకు తరలించారు. పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే గండీడ్ మండలానికి చెందిన ప్రధాన నిందితులు రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్ తో కలిపి మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈవ్య వహారంలో ప్రధాన సూత్రధారి అయిన రాజశేఖర్ రెడ్డి, ఇతర నిందితులను విచారిం చడం వారి నుండి పేపర్లను ఎవరెవరు కొనుగోలు చేశారనే విషయాన్ని ఆరా తీయడంతో నవాపేట మండల ఎంపీడీవో కార్యా లయంలో ఈజీఎస్ ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగి ప్రశాత్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది.
సిట్ అధికారులు శుక్రవారం జిల్లాకు చేరుకొని ప్రశాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నా రు. అతడిని నవాపేట పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి రాత్రి 7:30 గంటల నుండి శనివారం తెల్లవారుజాము 3గంటల వరకు విచారణ జరిపారు. ఇంజనీరింగ్ ఏఈ పరీక్షలకు సంబంధించి నిర్వహించిన ప్రశ్నాపత్రాల కొనుగోలుకు గాను 7.5 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని ప్రశ్నా పత్రాలను ముందుగానే తీసుకున్నట్లు నిందితుడు ప్రశాంత్ రెడ్డి సిట్ అధికారుల ముందు అంగీకరించినట్లు సమాచారం. తనతో పాటు నవాపేట మండలానికి చెందిన మరో ఇద్దరు యువకులు, షాద్ నగర్కు చెం దిన మరో యువకుడు ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసినట్లు ప్రశాంత్ రెడ్డి వెల్లడించినట్లు సమాచారం. నలుగురు కలిసి మొత్తం 30 లక్షలకు ఒప్పందం కుదుర్చు కున్నట్లు ప్రశాంత్ రెడ్డి సిట్ అధికారులకు తెలియజేసినట్లు తెలుస్తోంది. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరింత మంది పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరిన్ని వివరాలు సేకరించేందుకు శనివారం తెల్లవారుజామున 3:30గంటల ప్రాంతంలో ప్రశాంత్ రెడ్డిని సిట్ అధికారులు హైదరాబాద్కు తరలించారు.