అనన్య న్యూస్: జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్య గత ప్రభుత్వాల శాపమని, జవహర్నగర్లో దుర్గంధ సమస్యను గత ప్రభుత్వాలు వారసత్వంగా ఇచ్చాయని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని జవహర్నగర్ డంపింగ్ యార్డు ప్రాంగణంలో లీచెట్ శుద్ధి ప్లాంట్ను శనివారం మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. చెత్త నుంచి కరెంట్ ను ఉత్పత్తి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఈ శుద్ధి ప్లాంట్ను రూ. 250 కోట్లతో రాంకీ సంస్థ రెండు ఎంఎల్డీల సామర్థ్యంతో నిర్మించింది. కలుషిత వ్యర్థ జలాలను సంపూర్ణంగా శుద్ధి చేసేందుకు ఒక సమగ్రమైన పరిషారాన్ని సిద్ధం చేసిన జీహెచ్ఎంసీ, 2020లో సుమారు రూ.250 కోట్లతో జవహర్నగర్ డంప్ యార్డులో వ్యర్థ జలాల ట్రీట్మెంట్, మలారం చెరువుతో పాటు కృత్రిమ నీటి గుంటల రిస్టోరేషన్, శుద్ధి కార్యక్రమాన్ని రాంకీ సంస్థ చేపట్టింది. ప్రతి రోజు 8 వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తుందన్నారు. జవహర్ నగర్కు వచ్చే చెత్త ద్వారా 100 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చన్నారు. ప్రస్తుతం 20 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.