అనన్య న్యూస్, కరీంనగర్: కరీంనగర్లో టీటీడీ ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి దేవాలయ నిర్మాణానికి అనుమతి పత్రాలను సోమవారం హైదరాబాద్లోని తన నివాసంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కరీంనగర్ టీటీడీ ఆలయ నిర్మాణ అనుమతి పత్రాలను రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్, టీటీడీ తెలంగాణ లోకల్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ భాస్కరరావులకు అందజేశారు. ఆలయ నిర్మాణానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల స్థలం కేటాయించింది. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఏపీ సీఎం జగన్ ఆదేశాలతో కరీంనగర్ పట్టణంలో 20 కోట్ల రూపాయల వ్యయంతో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం నిర్మిస్తున్నామని తెలిపారు. మే 31వ తేదీన ఉదయం 7 గంటల 26 నిమిషాలకు శంకుస్థాపన నిర్వహిస్తామన్నారు. అనంతరం అదే ప్రాంగణంలో సాయంత్రం నుంచి కరీంనగర్ ప్రజలతో పాటు ఉత్తర తెలంగాణ ప్రలకు శ్రీవారి ఆశీస్సులు అందించే విధంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని కల్యాణోత్సవం నిర్వహిస్తామన్నారు.
మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ త్వరలోనే వినోద్రావు, భాస్కర్రావులతో కలిసి తిరుమలకు వెళ్తామని, ఆగమశాస్త్రం ప్రకారం కరీంనగర్ పద్మ నగర్లో నిర్మించే శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం అంతరాలయం, గోపురాలు, బాహ్యాలయ నిర్మాణాల నమూ నాలతో పాటు మూల విరాట్టు, పోటు, ప్రసాద వితరణ కేంద్రం తదితర అన్ని అంశాలను పరిశీలిస్తామన్నారు. త్వరితగతిన శ్రీవారి ఆయల నిర్మాణం పూర్తిచేసి కరీంనగర్తో పాటు తెలంగాణ ప్రజలకు ఆ దేవదేవుని ఆశీస్సులు అందిస్తామన్నారు.