అనన్య న్యూస్, కర్నూలు: రోహిణికార్తె ఎండలకు రోళ్లు పగులుతాయని అంటారు. రోళ్లు పగలడం ఏమో కానీ రోహిణి కార్తె రాకముందే ఎండలకు కొండలు పగులుతున్నాయి. ఎండ వేడిమికి కర్నూలు జిల్లా లోని గోనెగండ్లలో ఒక పెద్ద బండరాయి పగిలిపోయింది. భారీ శబ్ధంతో ఈ రాయి పగిలిపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. గోనెగండ్ల మండల కేంద్రంలోని నరసప్ప దేవాలయం దగ్గర ఓ పెద్ద కొండరాయి ఉంది. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పెద్ద శబ్ధం రావడంతో కాలనీ వాసులు ఉలిక్కిపడ్డారు. ఎక్కడ నుంచి శబ్ధం వచ్చిందని వెళ్లి పరిశీలించగా పగిలిన రాయి నుంచి పొగతోపాటు చిన్న చిన్న ముక్కలు రాలి పోతుండటాన్ని గమనించారు.
ఈ విషయాన్ని తహసీల్దార్ కార్యాలయానికి చేరవేశారు. కొండ చుట్టూ గృహాలు ఉన్నాయి. చీలిన కొండరాయిపై మరో రాయి ఉండడంతో కింద పడే ప్రమాదం ఉందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండలకు పగుళ్ళు ఇచ్చిన కొండ రాళ్లను తహసీల్దార్ వేణుగోపాల్ పరిశీలించారు. కొండరాళ్ల పక్కన ఉన్న ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చి ఖాళీ చేయిస్తామని తెలిపారు. మైనింగ్ అధికారుల సలహాలు సూచనలతో కొండరాళ్లను తొలగించే పనులు మొదలుపెడతామని ఆయన పేర్కొన్నారు. కొండ రాళ్ల పక్కన నివాసులున్నాయని, ఏమాత్రం పొరపాటు జరిగినా భారీ నష్టం జరుగుతుందన్నారు. టెక్నికల్గా కొండరాళ్ళను తొలగించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.