అనన్య న్యూస్, వరంగల్: దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తుందని, దేశాభివృద్ధిలో తెలుగు ప్రజల ప్రతిభ కీలకంగా మారిందని, దేశానికి ఇది స్వర్ణ సమయమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శనివారం వరంగల్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్పసభ వేదికగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ గా శంకుస్థాపనలు చేశారు.
హనుమకొండలో రూ.6.109 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. రూ.521 కోట్లతో రైలు వ్యాగన్ల కర్మాగార నిర్మాణానికి రూ.2.147 కోట్లతో జగిత్యాల-కరీంనగర్-వరంగల్ జాతీయరహదారి పనులకు, రూ.3.441 కోట్లతో మంచిర్యాల-వరంగల్ జాతీయరహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు తెలిపారు. తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లు పూర్తయింది. దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర అభివృద్ధిలోనూ తెలంగాణది ప్రధాన భూమిక. రూ. 6వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించుకుంటున్నాం. దేశాభివృద్ధి కోసం శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నాం. అనేక కారిడార్లను పూర్తి చేసుకుంటున్నాం. హైవేలు, ఎక్స్ ప్రెస్ వేలు, ఇండస్ట్రియల్, ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నాం.
తెలంగాణలో ముఖ్య చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలున్నాయి. కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమకు కేంద్రం సహకారం అందిస్తుంది. రైల్వే ఉత్పత్తుల విషయంలో రికార్డులు సృష్టిస్తున్నాం. తెలంగాణలో రైల్వే రహదారుల కనెక్టివిటీ పెంచుతున్నామని అన్నారు.