అనన్య న్యూస్, తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన శనివారం సాయంత్రం శ్రీవారు బంగారు తేరులో పయనిస్తూ, భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు. దాసభక్తుల నృత్యాలతోను, భజనబృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగారు.
స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ, భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం. స్వర్ణ రథోత్సవంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి దంపతులు, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సిఇ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 జగదీశ్వర్రెడ్డి, విజివో బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.