అనన్య న్యూస్, న్యూఢిల్లీ: కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. భారీ విజయాన్ని అందించిన కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కేంద్రం, రాష్ట్రాల్లో ఇవే ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు ఇది కర్ణాటక ప్రజల విజయమన్నారు. కర్ణాటకలో ప్రతి కార్యకర్త శ్రమించి పనిచేశారన్నారు. శత్రుత్వ దుకాణం మూతపడిందని, ప్రేమించే దుకాణం తెరుచుకుందని అన్నారు. పేదల తరపున కాంగ్రెస్ పోరాడిందని తెలిపారు.
బలవంతులపై బలహీనులు సాధించిన విజయమని చెప్పుకొచ్చారు. పెత్తందారులు, పేదల మధ్య యుద్ధం జరిగిందన్నారు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు హామీలను నెరవేరుస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఫలితాలు మొదలైనప్పుడు కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ కనిపించినప్పటికీ ఆ తరువాత పదిగంటల ప్రాంతంలో కాంగ్రెస్ పుంజుకుంది. మ్యాజిక్ ఫిగర్ను దాటేయడంతో పాటు మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. ప్రస్తుతం కాంగ్రెస్ 137 స్థానాల్లో గెలుపొందింది. అలాగే బీజేపీ 63 స్థానాల్లో, జేడీఎస్ 20 స్థానాలు, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు.