అనన్య న్యూస్, ఢిల్లీ: దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో మంగళవారం జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కోట బురుజుపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి మాట్లాడుతూ 140 కోట్ల భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని అన్నారు. బాపూజీ చూపిన అహింసా మార్గంలో స్వాతంత్య్రం సాధించామన్నారు.
స్వాతంత్య్ర సమరంలో అసువులుబాసిన మహానుభావులకు నమస్సుమాంజలులు పలుకుతున్నాని తెలిపారు. ఈ ఏడాది అరవిందుడు, దయానంద సరస్వతి 150వ జయంతి జరుపుకుంటున్నామని తెలిపారు. రాణి దుర్గావతి, మీరాబాయిని స్మరించుకోవాల్సిన తరుణమిదన్నారు. మణిపూర్లో జరిగిన దారుణం అత్యంత బాధాకరమైనదని తెలిపారు. కొద్దిరోజులుగా అక్కడ శాంతి నెలకొంటున్నదని, మణిపూర్కు యావజ్జాతి అండగా నిలుస్తున్నదని చెప్పారు.
మణిపూర్లో నూరు శాతం శాంతి సాధించాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు. సంపూర్ణ శాంతి సంకల్పంతో చర్చలు సాగుతున్నాయని వెల్లడించారు. ప్రధాని జెండా ఎగురవేసిన అనంతరం ఐఏఎఫ్ హెలికాప్టర్ తో పూలవర్షం కురిపించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలతో సహా పలువురు విశిష్ట అతిథులు హాజరయ్యారు. వేడుకల సందర్భంగా ఎర్రకోట బయట, లోపట ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేడయం ఇది పదోవసారి.