అనన్య న్యూస్, మహబూబ్ నగర్: రాష్ట్రంలో పర్యాటక రంగంతోపాటు, అన్ని రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని, ఉమ్మడి జిల్లాలో పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తానని రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిషన్, సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద, అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహబూబ్ నగర్ పిల్లల మర్రి వృక్షాన్ని బుధవారం మంత్రి ప్రారంభించి సందర్శకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ టూరిజం అభివృద్ధి ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని అన్నారు. ఎలాంటి సౌకర్యాలు లేని మధ్య ఆషియా దేశాలలో సైతం పర్యాటక రంగం ద్వారా జాతీయ ఆదాయాన్ని పొందుతున్నారని, జీవన ప్రమాణాలు సైతం బాగున్నాయని, అలాంటిది ప్రత్యేకించి భారతదేశం లాంటి చారిత్రక, సాంస్కృతిక ,వారసత్వ కట్టడాలు, ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్న దేశంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకించి మహబూబ్ నగర్ జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని వీటన్నిటి పై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందులో భాగంగా టూరిజం ప్రాంతాలకు విస్తృత ప్రచారం కల్పించడంతోపాటు, టూరిజంకు మార్కెట్ చేయాల్సి ఉందని అన్నారు. ప్రస్తుత యాంత్రిక జీవనంలో వారానికి ఒక రోజు కనీసం ఆహ్లాద వాతావరణాన్ని పొందాల్సి ఉందని తెలిపారు. ముఖ్యంగా యువత పెడదారి పట్టకుండా టూరిజం ద్వారా వారికి ఉపాధి,ఇతర సౌకర్యాలు కల్పించేందుకు మంచి అవకాశం కల్పిస్తుందని తెలిపారు.
మహబూబ్ నగర్ పిల్లల మర్రి మహావృక్షం మొదలు ఎక్కడుందో ఇప్పటివరకు ఎవరూ గుర్తుపట్టలేదని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలలో సౌకర్యాలను కల్పిస్తామని, ముఖ్యంగా పిల్లల మర్రి వద్ద రెస్టారెంట్, టాయిలెట్స్, పర్యాటకులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధిలో భాగంగా మొదటి విడతన మహబూబ్ నగర్ నుండి వసతుల కల్పనకు శ్రీకారం చుట్టనున్నామని, ఇందులో భాగంగా తక్షణమే 5 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నల్లమల అభయారణ్యం, మల్లెల తీర్థం, సోమశిల, ఫర్హాబాద్ వ్యూ పాయింట్ వంటి అనేక ప్రాంతాలు ఉన్నాయని, అంతేగాక సరళా సాగర్, కోయిల్ సాగర్, మన్నెంకొండ ,కురుమూర్తి వంటి దేవాలయాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయని, వీటన్నిటిని కలిపే విధంగా టూరిజం సర్క్యూట్ ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వీటితో పాటు జిల్లాలో 150 కిలోమీటర్ల నిడివి కలిగిన కృష్ణ నది ఉందని, కృష్ణ తిరుగు జలాలలో వాటర్ స్పోర్ట్స్ తో పాటు, బోటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసి టూరిజం ద్వారా ఆదాయాన్ని పొందేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని మంత్రి వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, మహబూబ్ నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర శాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, పర్యాటకశాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయ్, జిల్లా పర్యాటక ఇంచార్జ్ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.