అనన్య న్యూస్, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పని చేస్తున్న టౌన్ ఏఈ పృథ్వి ఏసిబి అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబి డిఎస్పి కృష్ణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మున్సిపల్ కాంట్రాక్టర్ యాదయ్య నుంచి 50వేలు లంచం తీసుకుంటుండగా పట్టణంలోని మెట్టుగడ్డ సమీపంలో ప్రత్యక్షంగా పట్టుకోవడం జరిగిందని, కాంట్రాక్టర్ గత సంవత్సరం మున్సిపాలిటీకి సంబంధించి రెండు పనులకు ఆన్లైన్లో టెండర్ వేసి 11 లక్షలకు దక్కించుకున్నాడని, ఈ పనులను పూర్తి చేసిన కాంట్రాక్టర్ యాదయ్య ఆ పనులకు సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో ఎంవి రికార్డు చేయాలని ఏఈ పృద్విని కోరగా లంచం డిమాండ్ చేశాడని తెలిపారు.
ఈ విషయాన్ని కాంట్రాక్టర్ యాదయ్య ఎసిబికి ఫిర్యాదు చేయడంతో శనివారం పథకం ప్రకారం ఏఈ పృథ్వికి ఒప్పుకున్న 50 వేల రూపాయలు పట్టణంలోని మెట్టుగడ్డ సమీపంలో యాదయ్య ఇస్తుండగా ప్రత్యక్షంగా పట్టుకొని అతనిపై కేసు నమోదు చేశామని తెలిపారు. అనంతరం విచారణ నిమిత్తం నిందితుడిని మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చి అందుకు సంబంధించిన ఫైల్స్ పరిశీలించామని, రేపు ఏసిబి స్పెషల్ కోర్టు నాంపల్లిలో అప్పగిస్తామని పేర్కొన్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు పైసలు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.