అనన్య న్యూస్, మహబూబ్ నగర్: బాలానగర్ మండల కేంద్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన చాలా బాధాకర విషయమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. శుక్రవారం బాలానగర్ మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలను శనివారం ఎమ్మెల్యే పరమార్శించి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరమార్శించి వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానని, మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని భరోసా కల్పించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందేలా చూస్తానని తెలిపారు. ఇప్పటికే మృతుల సమాచారం ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించామని తెలిపారు.