అనన్య న్యూస్, జడ్చర్ల: వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించెందుకే స్వయంగా వార్డులో పర్యటిస్తున్నానని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ 3వ వార్డు సరస్వతీ నగర్ కాలనీ, రాజీవ్ నగర్, సత్యనారాయణ స్వామి టెంపుల్ ఏరియాలో శుక్రవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటించారు. ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు. కాలనీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల కావలసిన సీసీ రోడ్లు, డ్రైనేజి పనులను వెంటనే ప్రారంభించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
మున్సిపల్ సిబ్బంది ప్రతిరోజూ చెత్త సేకరిస్తున్నారా, మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా అని కాలనీ వాసులను ఆరా తీశారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో 100 శాతం సీసీ రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కమిషనర్ మహమూద్ షేక్, కౌన్సిలర్లు సతీష్, రమేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.