అనన్య న్యూస్, జడ్చర్ల: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 50 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందని, 50 సంవత్సరాలలో రాష్ట్రంలో సక్రమంగా పనిచేస్తే ఈ సమస్యలు ఎందుకు ఉంటాయి.. ఈ యాత్రలేదంటూ ఆ పార్టీ నేతలపై ఐటి శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. గురువారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుట్ట వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ గృహ సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.
జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నాయకత్వంలో 560 డబుల్ బెడ్రూం ఇండ్లను పేదలకు అందించే కార్యక్రమాలను మృగశిర కార్తె నాడు చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. మహబూబ్నగర్కు హెలికాప్టర్లో వస్తూ పైనుంచి చూస్తుంటే ఎర్రటి ఎండాకాలంలో చెరువులు నిండుకుండల్లా మారి.. మత్తళ్లు దుంకుతున్నయ్. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హెలికాప్టర్ నుంచి ఉద్దండాపూర్, కరివెన ప్రాజెక్టులను చూపించారు. ఈ ప్రాజెక్టులు నిండితే 1.44లక్షల ఎకరాలకు నీళ్లు రాబోతున్నాయి. ఒకసారి కృష్ణా నీరు జడ్చర్లకు వస్తే దశాబ్దాల పాలమూరు గోస, పీడపోతుంది.. నా జన్మ ధన్యమవుతుందని రైతుల సంతోషాన్ని మీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాతో పంచుకున్నారని కేటీఆర్ తెలిపారు.
ఒక నాయకుడికి, ప్రజాప్రతినిధికి ప్రజలపై ఏమవుందో ఇదొక ఉదాహారణ చాలు. మిడ్జిల్లో చెక్డ్యామ్లు కడితే 5వేల ఎకరాలకు నీళ్లు వచ్చాయి. నియోజకవర్గంలో 628 చెరువులుంటే రూ.80కోట్లతో 371 చెరువులకు మరమ్మతులు చేశాం. వాటితో గంగపుత్రులు, ముదిరాజ్లకు, రైతులకు లాభం జరిగిందని చెరువుల పండుగ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంతోషంతో చెబుతున్నారు. తొమ్మిదేళ్లు నిండి పదేళ్లలో అడుగుపెడుతున్న తెలంగాణలో కొంత సంతోషకరమైన వాతావరణంలో పండగ చేసుకునే ప్రయత్నంలో మనమున్నాం. 15రోజల కిందట కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడకు వచ్చారు. వచ్చి మంచి మనిషి లక్ష్మారెడ్డిని నోటికి వచ్చినట్టు తింటిపోయిండు. కాంగ్రెస్ అధ్యక్షుడికి నోటిదూల ఎక్కువ.
గత ఎన్నికల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని 45వేల మెజారిటీతో గెలిపించారు. ఈ సారి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని 90వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిపించి ఆ సన్నాసులకు సమాధానం చెప్పాలి. కాంగ్రెసోళ్ల కథ ఎట్లనున్నదంటే.. ఒకాయనేమో రోడ్లు పట్టుకొని తిరుగుతున్నడు. 750 కిలోమీటర్ల తిరిగినా అంటున్నడు.. నిన్ను ఎవరు తిరుగుమన్నరు.. ఇంత గోసనీకెందుకొచ్చింది. మీరున్ననాడు 50 సంవత్సరాలు సక్కగా పని చేస్తే ఈ సమస్యలు ఎందుకుంటయ్..? ఈ యాత్రలు ఎందుకుంటయ్..? 50-55 సంవత్సరాలు రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించింది కాంగ్రెస్ కాదా? 2014 ముందు పరిస్థితి ఎట్ల ఉండేది. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కాక ముందు తెలంగాణలో రైతుల పరిస్థితి ఏంటీ? ఆడబిడ్డల పరిస్థితి ఏందీ? తాగు, సాగునీటి పరిస్థితేంటీ? ఎలా ఉండేదో ఒకసారి పరిస్థితి గుర్తు చేసుకోవాలన్నారు.