అనన్య న్యూస్, హైదరాబాద్: కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో దీక్ష విరమించారు. గురువారం కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జావడేకర్ నిమ్మరసం ఇచ్చి ఆయన చేత దీక్షను విరమింపజేశారు. తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై బుధవారం కిషన్ రెడ్డి ఇందిరా పార్కు వద్ద 24 గంటల దీక్ష చేపట్టారు. సాయంత్రం 8 గంటల సమయంలో దీక్షా సమయం ముగిసిందని పోలీసులు కిషన్ రెడ్డిని భాజపా రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. నిన్న జరిగిన తోపులాటలో కిషన్ రెడ్డి చేతికి, చాతికి గాయాలు కావడంతో వైద్యులు పరీక్షించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం మరోసారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరీక్షించారు.
రాబోయే వంద రోజుల్లో మరిన్ని పోరాటాలు: ప్రకాశ్ జావడేకర్
నిరుద్యోగుల తరఫున పోరాటం చేసేందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. దీక్ష నేపథ్యంలో భాజపా కార్యకర్తలు చూపిన తెగువను ఆయన అభినందించారు. కిషన్ రెడ్డి శాంతియుతంగా ధర్నా చేసిన అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. రాబోయే వంద రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.