అనన్య న్యూస్, హైదరాబాద్: ఈనెల 6వ తేదీన తుక్కుగూడలో కాంగ్రెస్ తెలంగాణ జన జాతర బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే జన జాతర సభా ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కేసీఆర్ పదేళ్ల విధ్వంసం పాలనను ప్రజలు మరువలేదన్నారు. ప్రతిపక్షం తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.
జాతీయ మేనిఫెస్టో ప్రకటనకు తెలంగాణను ఎంచుకున్నందుకు ఏఐసీసీ అధినాయకత్వానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రత్యేకమని, తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది సోనియాగాంధీ వల్లేనని పేర్కొన్నారు. ఈనెల 6న ఇక్కడే జాతీయ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి ముఖ్య నేతలంతా వస్తారని వెల్లడించారు. జాతీయ మేనిఫెస్టో ప్రకటనకు తెలంగాణను ఎంచుకున్నందుకు ఏఐసీసీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు చెప్పారు.
రాష్ట్ర నలుమూలల నుంచి లక్షల మంది ఈ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. గతంలో ఆరు గ్యారంటీలను తుక్కుగూడ సభలోనే ఇచ్చామని గుర్తు చేశారు. ఆరు హామీల్లో ఐదింటిని ఇప్పటికే అమలు చేసి చూపించామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు, సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు వంటివి ప్రవేశపెట్టామన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని కొనియాడారు. మహిళా విభాగానికి సంబంధించిన ఏర్పాట్లను సీతక్క, కొండా సురేఖ దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశించారు.