అనన్య న్యూస్, హైదరాబాద్: ఈనెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి మరో గ్యారంటీ అమలుపై కసరత్తు చేస్తున్నారు. శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
మార్చి 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని నిర్ణయించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇల్లు లేని అర్హులందరికీ పథకం వర్తింపజేయాలని, అందుకు అనుగుణంగా వెంటనే విధి విధానాలను తయారు చేయాలని సూచించారు. ఈ పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తారు. అందుకు సంబంధించిన నిబంధనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.