అనన్య న్యూస్, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఒక రోజు వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెలాఖరుకు సెప్టెంబర్ 30వ తేదీన తెలంగాణకు రావాలి. మారిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1వ తేదీన తెలంగాణకు వస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్లో బీజేపీ నిర్వహించనున్న బహిరంగ సభకు మోడీ హాజరై మాట్లాడుతారు.
రాష్ట్రంలో ఎన్నికల ఎజెండాను సెట్ చేసే విధంగా ప్రధాని మోడీ సభ జరుగుతుందని, తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన బీజేపీ ఇప్పుడు కార్యాచరణకు పదును పెడుతున్నది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోడీ సహా, పార్టీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలు తరుచూ తెలంగాణ పర్యటించి బహిరంగ సభల్లో ప్రసంగించే ప్రణాళికలు వేస్తున్నారు. శాసన ఎన్నికల కార్యాచరణను బహుముఖ వ్యూహంతో ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.