అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణ హక్కుల కోసం ఎంతకైనా పోరాడుదామని, బిఆర్ఎస్ పార్టీకి పోరాటం కొత్త కాదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలతో కెసిఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో సాగునీరు, తాగునీటి హక్కుల కోసం పోరాడడమే కాకుండా మా నీళ్లు మాకే అనే ప్రజా నినాదాన్ని స్వయం పాలన ప్రారంభమైన అనతికాలంలోనే నిజం చేసి చూయించిన ఘనత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిదన్నారు.
కేంద్రం వేసే ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ కేంద్రం వత్తిళ్ళను తట్టుకుంటూ పదేండ్ల పాటు బిఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసి కాపాడిందన్నారు. ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం వస్తే మనం అడుక్కోవాల్సి వస్తుందని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ అవగాహన రాహిత్యంతో సంతకాలు చేసి తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టలమీదికి కూడా పోలేని పరిస్థితి దాపురించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదని, ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందన్నారు. ప్రాజెక్టుల అప్పగింతపై పోరటాన్ని ఉధృతం చేస్తామని, బిఆర్ఎస్ కు పోరాటం, ఉద్యమం కొత్తకాదన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి తీరుతామన్నారు.