అనన్య న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ చేతివృత్తుల వారి జీవన ప్రమాణాలను పెంచడానికి బీసీలకు రూ. లక్ష సహాయ పథకం నిరంతర ప్రక్రియని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రులు హరీష్ రావ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కులవృత్తుల్లోని చేతివృత్తులకు చేయూతనిచ్చి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ప్రత్యేకంగా లక్ష రూపాయల సాయాన్ని ప్రకటించారని గుర్తు చేశారు. శనివారం వరకు 2,70,000 దరఖాస్తులు ఆన్లైన్లో నమోదయ్యాయని వివరించారు. మొదటగా అర్హతకలిగిన లబ్ధిదారుల్లోని అత్యంత పేదవారికి అందజేస్తామని వెల్లడించారు. బీసీలకు లక్ష సాయం అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు.
ప్రతి నెలా 5వతేదీ లోపు కలెక్టర్లు లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. ఇన్చార్జి మంత్రులు ధ్రువీకరించిన జాబితాలోని లబ్ధిదారులకు ప్రతీ నెల 15వ తారీఖున స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా సహాయాన్ని అందజేస్తామన్నారు. దరఖాస్తుదారులు కేవలం వెబ్సైట్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫారాన్ని ఏ ఆఫీసులోనూ, ఏ అధికారికి గాని సమర్పించాల్సిన అవసరం లేదన్నారు.
ఎంపికైన లబ్ధిదారులు నెలరోజుల్లోపు తమకు నచ్చిన, కావాల్సిన పనిముట్లను, సామాగ్రిని కొనుక్కోవాలని సూచించారు . లబ్ధిదారుల అభివృద్ధి కోసం అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని అన్నారు. నెలలోపు లబ్ధిదారులతో కూడిన యూనిట్ల ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బీసీ సహాయం పథకం తొలిదశ అమలును బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం క్యాబినెట్ సబ్ కమిటీకి వివరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి. వెంకటేశం, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, అధికారులు పాల్గొన్నారు.