అనన్య న్యూస్, హైదరాబాద్: రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చినప్పుడు అందరూ సహకరించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. బుధవారం సంగారెడ్డి జిల్లాలో మోనిన్ పరిశ్రమకు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. దేశంలోనే మొదటి యూనిట్ను సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న మోనిన్ సంస్థ రూ.300 కోట్లకుపైగా పెట్టుబడితో 40ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, దేశంలోనే మొదటి యూనిట్ని మోనిస్ సంస్థ సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేస్తుందన్నారు.
స్థానిక యువతకు ఉద్యోగం కల్పించడానికి సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని, ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 400 మందికి ఉపాధి లభిస్తుందని, ఇది జీరో పొల్యూషన్ ప్లాంట్ అని ప్రశంసించారు.18 నెలల్లో ప్లాంట్ నిర్మాణాలు పూర్తి అవుతాయని, కొంత మంది రాజకీయాలు చేస్తారని, నిజనిజాలు తెలుసుకోవాలని అన్నారు. మన మీద నమ్మకంతో పెట్టుబడి పెడుతున్న వారికి అన్ని రకాలుగా సహకరించాలని కోరారు. ఎవరు పరిశ్రమ పెట్టినా కేరాఫ్ అడ్రస్గా తెలంగాణ మారిందన్నారు.
భారతదేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని తెలిపారు. రూ.300 కోట్లకు పైగా పెట్టుబడితో 40 ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. రాజకీయాలు ఎప్పుడు ఉంటాయని, అన్ని ఎన్నికలప్పుడు చేసుకోవచ్చన్నారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు సింగిల్ విండో తీసుకవచ్చిందన్నారు.