అనన్య న్యూస్, హైదరాబాద్ : అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని మనం ఊహించలేమని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్లలోనే సమతుల్య పర్యావరణం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, ఇప్పుడు దశాబ్ది తెలంగాణలో ఆ ఫలితాలు చూస్తున్నామని వెల్లడించారు. సోమవారం అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అడవుల రక్షణ కోసం ఆత్మార్పణం చేసిన అమరులకు సీఎం కేసీఆర్ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హైదరాబాద్ లాంటి కాంక్రీట్ నగరంలో కూడా ఊహించనంత పచ్చదనం పెరగడంతో అంతర్జాతీయ ఉద్యానవన ఉత్పత్తిదారుల సంఘం అందించే వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్- 2022 హైదరాబాద్ కు దక్కిందన్నారు.
పర్యావరణ పరంగా తగిన రక్షణ చర్యలు చేపట్టని ఫలితమే గ్లోబల్ వార్మింగ్ రూపంలో చూస్తున్నామని వెల్లడించారు. అందుకే మనతో పాటు, భవిష్యత్ తరాలు కూడా ఈ భూమిపై జీవించే హక్కును కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. అటవీ రక్షణ కోసం కార్యదీక్షతో పనిచేసిన అధికారులు, సిబ్బంది 22 మంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని, వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తి దాయకమన్నారు. జంగల్ బచావో జంగల్ బడావో’ నినాదాన్ని చిత్తశుద్ధితో మనం అమలు చేయాలన్నారు.