- తెలంగాణ ముదిరాజ్ ఆత్మగౌరవ సభతో దద్దరిల్లిన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్..
అమన్య న్యూస్, హైదరాబాద్: ఓట్లు మావే.. సీట్లు మావే అనే నినాదంతో ముదిరాజులు పోరాడాలని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ముదిరాజులను బిసి-డి నుంచి బీసీ- ఏ కేటగిరీలో చేర్చాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన తెలంగాణ ముదిరాజ్ ఆత్మగౌరవ సభకు ఈటల రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ తెలంగాణలో ముదిరాజులు 11 శాతం ఉన్నారని జనాభా ప్రకారం ముదిరాజులకు 11 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని అన్నారు. బీసీలకు 9 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటే కేవలం మూడు పదవులు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో 11 శాతం ముదిరాజు సామాజిక వర్గం ఉంటే.. రాజకీయంగా ఏ పార్టీ కూడా ఆదరించలేదని అన్నారు. ముదిరాజులకు విద్య, ఉద్యోగ అవకాశాలు రావలంటే గతంలోనే బీసీ డీ నుంచి బీసీ ఏ కు వేయాలని ఆలోచన చేశామని పేర్కొన్నారు.
మొట్ట మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు శాసన సభలో ముదిరాజుల గురించి ప్రస్తావన తీసుకొచ్చానని అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముదిరాజుల సమస్యలను అర్థం చేసుకొని వారి గురించి ఆలోచినస్తామని చెప్పినట్లు తెలిపారు. అలాగే 2008లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముదిరాజులను ‘బీసీ డీ’ నుంచి ‘బీసీ ఏ’కు మార్చారని.. మైనార్టీలకు కూడా 4 శాతం రిజర్వేషన్ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఇవి కేవలం ఒక్క ఏడాది మాత్రమే అమలయ్యాయని ఆ తర్వాత ఆగిపోయాయని తెలిపారు. అయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వారి పక్షాన మైనార్టీ ఎమ్మెల్యేలు ఉండటంతో.. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషల్ అమలు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. కానీ ముదిరాజుల సమస్యను ఎవరూ కూడా పట్టించుకోలేదని.. ఇప్పటికీ ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉందని చెప్పారు.
తెలంగాణ వచ్చాకా సీఎం కేసీఆర్ కూడా ఆ సమస్యను పరిష్కరించలేదని ఆరోపించారు. బానిసలుగా బతుకుదామా పిడికిలెత్తి ముందుకు వెళ్దామా అని ముదిరాజులను ఉత్తేజ పరిచారు. అన్నిపార్టీల్లో ముదిరాజ్ లకు సీట్లు కేటాయించాలని అంతే కాకుండా మత్సకార రక్షణ చట్టం, ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన అన్నింటిని ఎదుర్కొని ముదిరాజ్ ఆత్మగౌరవ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ముదిరాజులు తరలివచ్చారు. ముదిరాజ్ కులానికి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ ముదిరాజ్ ఆత్మ గౌరవ సభకు హాజరయ్యారు. తెలంగాణ ముదిరాజుల ఆత్మగౌరవ సభతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దద్దరిల్లింది.