తిరుపతి నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కోట్ల రూపాయల్లో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫొటో ఫ్రేమ్ వర్క్స్ షాపులో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు ఉవ్వెత్తున వ్యాపించి ఇళ్ల దిశగా వచ్చాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దూరంగా పరుగెత్తారు. గోవిందరాజస్వామి ఆలయ రథానికి సమీపం వరకూ మంటలు వ్యాపించాయి. స్థానికులు కొంత మంది కలిసి రథాన్ని దూరంగా లాగడంతో ప్రమాదం తప్పింది.
ఈలోగా అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పి వేశారు. 2 గంటలకు పైగా శ్రమించి మొత్తం 10 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గోవిందరాజస్వామి ఆలయం పక్కన ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో ఫోటో ఫ్రేమ్ వర్క్స్ దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో భవనం ముందు ఉన్న 5 బైక్లు దగ్ధమయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.