అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ ప్రజా గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ ఘన నివాళులు అర్పించారు. గురువారం గుర్రంగూడ లోని సాయిచంద్ నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. సాయిచంద్ భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. సాయిచంద్ ను చూడగానే ముఖ్యమంత్రి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల వద్దకు చేరుకొని ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
.. సార్ సాయిని పిలువండి. లెమనండి..మీరు పిలిస్తే లేచివస్తాడు..సార్.. అంటూ హృదయ విదారకంగా రోదిస్తున్న సాయిచంద్ భార్య రజనీని ఓదార్చడం సీఎంకు కష్టంగా మారింది. ఏడుస్తున్న సాయి చంద్ భార్యను సీఎం కేసీఆర్ ఓదార్చారు. దగ్గరకు వచ్చి రోధిస్తున్న సాయిచంద్ తండ్రిని సీఎం అక్కున చేర్చుకొని ఓదార్చారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని, కళాకారున్ని కోల్పోయిందని సీఎం కేసీఆర్ అన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అని పేర్కొన్నారు. మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని సీఎం విచారం వ్యక్తంచేశారు.
మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీలు గోరేటి వెంకన్న, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి తదితర ప్రజాప్రతినిధులు పార్టీ నేతలు సీఎం కేసీఆర్ వెంట వచ్చి నివాళులర్పించారు.
