అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆదివారం బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లో ఎన్నికల హామీలను మీడియాకు వెల్లడించారు. తమ పార్టీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని సీఎం కేసీఆర్ భీమా వ్యక్తం చేశారు. అనేక ప్రజాకర్షక హామీలను ప్రకటించారు. తాము 3వ సారి అధికారంలోకి వస్తే ప్రస్తుత పథకాలను కొనసాగించడంతో పాటు కొత్త హామీలను 6 నెలల్లోనే అమలు చేస్తామని అన్నారు.
అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకున్నామన్న సీఎం కేసీఆర్ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం దాన్ని పేదలకు పంచడమనే విధానంతోనే తొలి నుంచి తమ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. గతంలో అనేక కార్యక్రమాలు చేష్టటామని ఈసారి కూడా అలాగే చేస్తామన్నారు. గత ఎన్నికల ప్రణాళికలో చెప్పని అంశాలను సైతం అమలు చేసిన ఘనత తమదేనన్నారు.
సీఎం కేసీఆర్ ప్రకటించిన కీలక హామీలివే:
- కేసీఆర్ బీమా – ప్రతి ఇంటికి ధీమా: తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి పేద ఇంటికి రైతు బీమా తరహాలోనే ఎల్ఎస్ఐసీ ద్వారా రూ.5లక్షల జీవిత బీమా. దీనిద్వారా దాదాపు 93 లక్షల కుటుంబాలకు లబ్ది.
- ఆసరా పింఛను రూ.5,016కి పెంపు. ప్రస్తుతం రూ.2.016 ఇస్తుండగా.. తొలి సంవత్సరంలో రూ.3,016కు పెంచుతారు. ఏటా రూ.500ల చొప్పున ఐదేళ్లలో రూ.5,016 ఇస్తారు.
- దివ్యాంగులకు పింఛను రూ.6వేలకు పెంపు, దివ్యాంగుల పింఛను తొలి ఏడాది రూ.5 వేలకు పెంపు. ఏటా రూ.300ల చొప్పున పెంచుతాం.
- ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 15లక్షలకు పెంపు.
- సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతి నెల రూ.3వేలు చొప్పున భృతి చెల్లిస్తాం.
- అర్హులైన పేదలతో పాటు అక్రిడేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టులకు రూ. 400కే గ్యాస్ సిలిండర్. ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరుతో రూ.15 లక్షల వరకు ఆరోగ్య బీమా..
- రైతు బంధు సాయం మొత్తాన్ని రూ.16వేలకు దశల వారీగా పెంచుతాం. తొలి ఏడాది సాయాన్ని రూ.12వేల వరకు పెంపు.
- పవర్ పాలసీ, అగ్రికల్చర్ పాలసీ తదితర పాలసీలన్నింటినీ యథాతథంగా కొనసాగిస్తాం. ఇంకా అవసరమైన ఉద్దీపనలు ఏయే రంగాల్లో అవసరమో వాటిని కూడా చేసుకుంటూ ముందుకు సాగుతాం.
- ప్రజల ఆశీర్వాదంతో భారాస ప్రభుత్వమే ఎన్నికవుందని బలంగా విశ్వసిస్తున్నాం. మేం ఇచ్చే ఈ హామీలను మళ్లీ అధికారంలోకి వచ్చిన ఆరు, ఏడు నెలల్లో అమలు చేస్తాం.
- తెలంగాణ అన్నపూర్ణ’ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సన్నబియ్యం అందజేస్తాం.
- దళిత బందు, రైతు బీమా కొనసాగింపు.
- గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగింపు. భవిష్యత్తులో గిరిజనులకు మరిన్ని పథకాలు తెస్తాం.
- లంబాడీ తండాలు, గోండు గూడేలను పంచాయతీలను చేస్తాం.
- అగ్రవర్ణాల కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల.
మహిళా సంఘాలకు స్వశక్తి భవనాలు. - రాష్ట్రంలో అనాథల కోసం ప్రత్యేక పాలసీ.
- ప్రభుత్వ ఉద్యోగుల ఓల్డ్ పెన్షన్ కోసం కమిటీ ఏర్పాటు.