అనన్య న్యూస్, హైదరాబాద్: ప్రతినెల 10వ తేదీ లోపు గ్రీన్ఛానల్ ద్వారా అన్ని విద్యాసంస్థలకు నిధులు వస్తాయిని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరులోని టీజీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలకు కామన్ డైట్ ప్లాన్ సిఎం ప్రారంభించారు.తర్వాత విద్యార్థులతో కలిసి సిఎం భోజనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతినెల 10న గురుకులాలు, హాస్టల్స్ బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. గ్రీన్ఛానల్ ద్వారా నేరుగా అకౌంట్లలో జమ చేస్తామని తెలిపారు.
ఇకపై ప్రతినెలా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు గురుకులాలు, హాస్టల్స్ను విధిగా పరిశీలిస్తారని చెప్పారు. అలాగే, గురుకులాలు, సంక్షేమహాస్టల్స్కు కూడా ఉచిత విద్యుత్ అందించనున్నట్లు సీఎం తెలిపారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఆహారం, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ధృడ సంకల్పంతో పని చేస్తున్నామని, విద్యార్థుల్లో స్కిల్స్ కోసం టాటాగ్రూప్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లు చెప్పిన సిఎం.. 75 ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని, ఐటీఐలో చేరితే ఉద్యోగం వస్తుందనే నమ్మకం కల్పిస్తామని అన్నారు.