- సిఐ ఆదిరెడ్డికి వినతి..
అనన్య న్యూస్, జడ్చర్ల: విధి నిర్వహణలో వార్తను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని ఖండిస్తూ జడ్చర్లలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో బుధవారం అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసి, అంబేద్కర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబు పై ప్రభుత్వం చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాస్తవాలను జనాలకు చూపించేందుకు తాపత్రయం పడుతున్న జర్నలిస్టులపై వ్యక్తిగతంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం వివిధ జర్నలిస్ట్ సంఘాల నాయకులు, నియోజకవర్గం జర్నలిస్టులు జడ్చర్ల పోలీస్ స్టేషన్ కు చేరుకొని సిఐ ఆదిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జర్నలిస్టులు రాచాల నరేందర్ గౌడ్, మానే శశికాంత్, రవీందర్ గౌడ్, శ్రీధర్, డేవిడ్, శ్రీనివాసులు, అమర్, దాస్, తెలుగు ప్రభ రిపోర్టర్ గోనెల నరేందర్, మల్లేష్, శేఖర్, జైపాల్, కాజా, హైదర్ అలీ, అబ్దుల్లా, కిరణ్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
