అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తే తప్పేముందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రశ్నించారు. జడ్చర్ల అండర్ బ్రిడ్జి పనులు పూర్తయి ప్రారంభం కాకపోవడంతో ప్రజలే వాడుకుంటున్నారనే విషయంపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పందించారు.
ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి శుక్రవారం మండల పరిధిలోని ఆలూరు గ్రామానికి రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రారంభం కాకుండా ప్రజలు వాడుకుంటే తప్పేముందని, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పార్లమెంటు సమావేశాల్లో ఉన్నందున బ్రిడ్జి ప్రారంభం చేయలేకపోయామన్నారు.
బ్రిడ్జ్ నిర్మాణం కేంద్ర నిధులతో చేపట్టింది కాబట్టి ఎంపీ డీకే అరుణ వచ్చిన వెంటనే బ్రిడ్జిని ప్రారంభిస్తామన్నారు. జడ్చర్ల పట్టణానికి చెందిన కొందరు బ్రిడ్జి ప్రారంభం చేయకుండానే ప్రజలు వాడుకుంటున్నారని మాట్లాడుతున్నారని, ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడం కాదని, వాడుకుంటే తప్పేముందని అన్నారు. త్వరలోనే అండర్ బ్రిడ్జిని ప్రారంభిస్తామన్నారు.