అనన్య న్యూస్, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో సోమవారం తెలంగాణ కేబినెట్ సమావేశమయ్యింది. సిఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం దాదాపు నాలుగు గంటల పాటు జరిగింది. సమావేశంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు, ఖరీఫ్ యాక్షన్ ప్లాన్, ధాన్యం కొనుగోళ్లుతోపాటు పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించింది.
రాష్ట్ర సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ సాగు ప్రణాళిక, మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలలు, కళాశాలల్లో చేపట్టాల్సిన పనులు తదితర అంశాలపై కేబినెట్ చర్చించింది.
ముఖ్యంగా రైతులకు నష్టం జరగకుండా చివరి గింజ వరకు కొనాలని కేబినెట్ ఆదేశించింది. ప్రధానంగా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని, ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీని ఆహ్వానించాలని నిర్ణయించారు. అదేవిధంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై పూర్తి బాధ్యత కలెక్టర్లదేననని మంత్రివర్గం, రైతులకు నష్టం జరగకుండా చివరి గింజ వరకు కొనాలని ఆదేశించింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా సన్న వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.