అనన్య న్యూస్, హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్సీ అభ్యర్థులు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఇతర అంశాలపై నేతలతో చర్చించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలంతా కలిసికట్టుగా పనిచేసి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాలు గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. పోలింగ్ బూతుల వారిగా నేతలు బాధ్యతలు తీసుకొని లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు పలు సూచనలు చేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చొరువను ప్రజలకు వివరించాలన్నారు. వంద రోజుల ప్రజా పాలనలో కాంగ్రెస్ అమలు చేసిన గ్యారెంటీలను ప్రజలకు వివరించాలని తెలిపారు. సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ అభ్యర్థులు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లు, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.