- రాష్ట్ర అధికారిక గీతంగా జయ జయహే తెలంగాణ..
అనన్య న్యూస్, హైదరాబాద్: వాహన రిజిస్ట్రేషన్లలో టీఎస్ కు బదులు ఉద్యమ సమయంలో ప్రజలు నినదించిన టీజీ అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అని దాన్ని నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో మార్పులు చేపట్టే దిశగా ముందుకెళ్తోంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ కేబినెట్ తీసుకున్ననిర్ణయాలపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సోషల్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ఒక జాతి అస్థిత్వానికి చిరునామా ఆ జాతి భాష.. సాంస్కృతిక వారసత్వమేనని అన్నారు. ఆ వారసత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతోనే జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించినట్లు తెలిపారు.
సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా రాచరిక పోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికార చిహ్నంగా మార్పులు చేపట్టబోతున్నామన్నారు. ఈ అంశాలన్నీ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రక్రియ దిశగానే కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు..