అనన్య న్యూస్, జడ్చర్ల: తెలంగాణ ఎవరు ఇయ్యలే.. చావు నోట్ల తలపెట్టి సాధించామని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రజా ఆశీర్వాద సభలలో భాగంగా బుధవారం జడ్చర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పొరపాటున అధికారం ఇస్తే 24 గంటల కరెంటుకు రామ్ రామ్, దళిత బందుకు జై భీమ్ పలకడం ఖాయమని సీఎం కేసీఆర్ తెలిపారు.1956లో జరిగిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల 60 ఏళ్లు గోసవడ్డం.. ఎక్కడ చూసినా కరువు కాటకాలు.. వలసలు.. కన్నీళ్లు తప్ప మరి ఏమీ ఉండేవి కావని అన్నారు.
పాలమూరు జిల్లాలో అంబలి, గంజి కేంద్రాలు ఏర్పాటు చేస్తుంటే కన్నీళ్లు వచ్చినయ్.. ప్రొఫెసర్ జయశంకర్ సార్ నేను కలిసి ఈ జిల్లాలో తిరిగినప్పుడు ఈ ప్రాంత ప్రజలే కాదు.. అడవులలో ఉన్న చెట్లు కూడా బక్క చిక్కిపోయాయని ఆవేదన చెందినట్లుగా చెప్పారు. పక్కన కృష్ణమ్మ ఉన్న సాగునీరు కాదు కదా.. తాగునీరు కూడా తెచ్చుకోలేని దిస్థితి .. ఎంతోమంది త్యాగాలు.. పోరాటాలు.. చేయడం వల్ల తెలంగాణ తెచ్చుకున్నాం.. ఎవరు ఉట్టిగా ఇవ్వలేదు.. మీ పాలమూరు జిల్లా ఎంపీగా తెలంగాణను తెచ్చుకున్నాం.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే ఈ ప్రాంత దరిద్రులు కొందరు బెత్తెడున్న జూరాల నుండి సాగునీటిని తీసుకోవచ్చు కదా అంటారు. రోజు రెండు టీఎంసీల చొప్పున నీళ్లను తీసుకుంటే 9 టీఎంసీల కెపాసిటీ ఉన్న జూరాల ఖాళీ అవుతుంది అన్న విషయం కూడా తెలియదు.. పైగా ఎన్నో కేసులు వేశారు. ఇప్పుడిప్పుడే ఆ కేసులని కొలిక్కి వస్తున్నాయి. పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చేసుకుంటే లక్ష్మీ అమ్మవారు తాండ విస్తున్నట్లుగా మారుతుందని తెలిపారు.
కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పొరపాటున అధికారంలోకి వస్తే కరెంటును కాట్ల కలుపుతారు. 24 గంటలు కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం మనదే. ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలోనూ కరెంటు సక్రమంగా లేక రైతులు ఆందోళనలు చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు సమీపంలో ఉన్న జడ్చర్లను రాబోయే రోజులలో ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతాం అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి తెలంగాణ కోసం నాతోపాటు పదవికి రాజీనామా చేశారు. ఎంపీగా పోటీ చేసినప్పుడు అన్ని విధాల సహకరించాడు.. మళ్లీ చర్లకోల లక్ష్మారెడ్డిని గెలిపించుకుంటే జడ్చర్ల నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.