- తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: ప్రధాని మోడీ..
- తెలంగాణకు ప్రధాని మోడీ వరాలు..
అనన్య న్యూస్, మహబూబ్ నగర్: తెలంగాణలో అభివృద్ధి పేరిట దోపిడీ జరుగుతోందని, బిజెపితోనే తెలంగాణలో పారదర్శక అభివృద్ధి జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం పాలమూరు ప్రజాగర్జన సభకు హాజరైన ప్రధాని మోడీ తెలంగాణ ప్రజలకు ఎన్నో వరాలు ప్రకటించారు. తెలంగాణలో పసుపు బోర్డు సమ్మక్క సారక్క పేరుతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అవినీతి రహిత ప్రభుత్వం రావాలని, మభ్యపెట్టే మాటలు చెప్పే ప్రభుత్వం కాకుండా అభివృద్ధి చేసే ప్రభుత్వం రావాలని ప్రజలు అనుకుంటున్నారని, అది చెప్పింది చేసే బిజెపి ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ క్రమంలో కీలక ప్రకటనలు చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్రంలో పసుపు రైతుల కోసం జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డు కృషి చేస్తోందన్నారు. తెలంగాణలో పసుపు పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారన్న ప్రధాని పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు.
ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క పేరుతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రూ.900 కోట్లతో సమ్మక-సారలమ్మ పేరుతో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ రోజు మనం అనేక రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రారంభించామనీ, అభివృద్ధి రోడ్డు, రైలు కనెక్టివిటీతో ముడిపడి ఉందన్నారు. మహిళా బిల్లును పార్లమెంట్లో ఆమోదించామని తెలిపారు. పార్లమెంటులో నారీ శక్తి బిల్లును ఆమోదించాం. దేశంలో పండుగల సీజన్ నడుస్తోంది. నవరాత్రికి ముందే శక్తి పూజ ప్రారంభించాము. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి జరుగుతుందనీ రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తామన్నామని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.