అనన్య న్యూస్, సిద్దిపేట: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పేదింట్లో కళ్యాణ కాంతులు నింపిన ఆడబిడ్డల ఆత్మీయ బంధువు సీఎం కేసీఆర్ అని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నియోజక వర్గ పరిధిలోని చిన్నకోడూరు, నంగునూరు, సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట మండలాలలోని 149 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వైద్య పరీక్షలు టీఫా స్కానింగ్, న్యూట్రిషన్ కిట్, కేసిఆర్ కిట్ అందిస్తున్నామని తెలిపారు.
ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా ఖర్చు చేసుకోవద్దన్నారు. గర్బిణీలకు రక్తహీనత తగ్గించేందుకు గోళీలు ఇస్తున్నమని, అమ్మ ఒడి వాహానం సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేదింటి ఆడబిడ్డకు ఆసరాగా నిలిచి కడుపు నిండా మీకు రుచికరమైన బోజనం పెట్టి, రూపాయి లంచం లేకుండా కళ్యాణ లక్ష్మి, షాధి ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇచ్చి ఆదుకుంటున్నామన్నారు. నియోజకవర్గంలోని 149 మంది లబ్ధిదారులకు రూ.1.49,17,584 కోట్లు రూపాయల చెక్కులను అందించినట్లు తెలిపారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.