అనన్య న్యూస్, మహబూబ్నగర్: వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే నని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో మాట్లాడుతూ.. K అంటే కాలువలు.. C అంటే చెరువులు.. R అంటే రిజర్వాయర్లు అని చెప్పుకొచ్చారు. పసిడి పంటలతో పచ్చబడ్డ పాలమూరుకు ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు. బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని చూస్తే ప్రతిపక్షాలకు నోట్లో మాట రావడం లేదని విమర్శించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సీఎం కేసీఆర్ పట్ల సంస్కారం లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ అడుగుతున్నరని, కాంగ్రెస్ కు ఒకటి కాదు 11 సార్లు దేశ ప్రజలు అవకాశం ఇచ్చారు. 55 ఏళ్లు అవకాశం ఇస్తే ఏం చేశారో ఆ పార్టీ నేతలు చెప్పాలని అన్నారు.
పాలమూరు ఆశీర్వాదంతో ఎంపీగా గెలిపించిన కేసీఆర్.. పాలమూరు ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటారని, పాలమూరు బిడ్డల ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. అభివృద్ధి జరుగుతుంటే విమర్శలు వస్తూనే ఉంటాయని.. అయినా సవాళ్లను దాటుకొని ముందుకు సాగాలని పేర్కొన్నారు. వలసలకు అడ్డాగా ఉన్న పాలమూరు ప్రస్తుతం పరిశ్రమలకు అడ్డాగా మారిందన్నారు. పాలమూరు, రంగారెడ్డి రిజర్వాయర్లతో పదిలక్షల ఎకరాలకు నీరు అందించబోతున్నామని చెప్పారు. కేవలం మహబూబ్ నగర్ జిల్లాకే 33 టీఎంసీల నీటితో పాలమూరు కరువును కనుమరుగు చేస్తుందన్నారు. పాలమూరు -రంగారెడ్డి రిజర్వాయర్కు జాతీయ హోదా కల్పిస్తామన్న ప్రధాని హామీ ఏమైందని ప్రశ్నించారు. బీజేపీకి ఎన్నికల సమయంలోనే దేవుళ్లు గుర్తుకు వస్తారని యెద్దేవా చేశారు. దేవుళ్ల పేరుతో మత విద్వేషాలు రెచ్చ గొడుతున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.