- జులై వరకు కరివెన జలాశయానికి నీటిని తరలించాలి
అనన్య న్యూస్, హైదరాబాద్: నూతనంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మొట్ట మొదటి సమీక్షా సమావేశం సోమవారం నిర్వహించారు. సుప్రీంకోర్టు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీటి పనులను కొనసాగించడానికి అనుమతించిన నేపథ్యంలో సమీక్షా సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ చర్చించారు. ఇందులో భాగంగా జూలై వరకు కరివెన జలాశయంకు నీళ్ళు తరలించాలని, ఆగష్టు వరకు ఉద్దండపూర్ వరకు నీటిని ఎత్తిపోయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇందులో నార్లపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండపూర్ జలాశయాలకు సంబంధించి మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, వాటి సంబంధిత పంప్ హౌజ్ లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, ఒక రిజర్వారయ్ నుంచి మరొక రిజర్వాయర్ కు నీటిని తరలించే ‘కన్వేయర్ సిస్టమ్’ లో మిగిలిన పనులను కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాలమూరు జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పనులకు సంబంధించిన పురోగతి పై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. వాటిలో మిగిలిన కొద్దిపాటి పనులను ఈ జూన్ లోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.