అనన్య న్యూస్, మహబూబ్ నగర్: తొలి దశ ఉద్యమాన్ని పాలమూరు జిల్లాకు చెందిన నాయకులు, ప్రజలు ముందుకు తీసుకెళ్లారని టిపిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ నిరసన సభకు రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భర్తీ చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. నిరుద్యోగుల జీవితాలో చెలగాటం ఆడుతున్న కేసీఆర్ను క్షమించే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణ త్యాగాలు చేసింది పేదోళ్ల బిడ్డలయితే.. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం పదవులతో ఎంజాయ్ చేస్తున్నారని రేవంత్రెడ్డి మండిపడ్డారు.
పాలమూరు గడ్డ కష్టాన్ని నమ్ముకున్న గడ్డ. దేశంలో ఎక్కడైనా కష్టజీవి ఉన్నాడంటే అది పాలమూడు బిడ్డనే. పలుగు, పార, తట్ట, మట్టి పట్టేవారు పాలమూరు బిడ్డలే. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో మన శ్రమ ఉంది. కాంగ్రెస్ హయాంలో బీమా, కోయిలసాగర్, నెట్టెంపాడును పూర్తి చేశాం. కృష్ణానదీ, తుంగభద్ర జలాలతో పాలమూరు తడుస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు దళితులను పట్టించుకోని కేసీఆర్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున అంబేద్కర్ ముసుగుతో రావాలని చూస్తున్నారని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రేవంత్రెడ్డి సూచించారు. అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత కేసీఆర్కు లేదన్నారు. హనుమంతరావు విగ్రహం తీసుకుస్తే అరెస్టు చేసిన విషయం ప్రజలు మర్చిపోలేదదన్నారు. కేబినెట్లో నీ కులపోళ్లు నలుగురు ఉండి. మాదిగలకు మంత్రి వర్గంలో చోటు లేనప్పుడు సామాజిక న్యాయం ఎలా అవుతుందని ఆయన నిలదీశారు.
పాలమూరు యూనివర్సిటీలో 150 పోస్టులకు కేవలం 20 మంది మాత్రమే ఉన్నారన్నారని ఆయన విమర్శించారు. ఓటును డబ్బులకు అమ్ముకోవద్దని ఒక వేళ డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తే మన ఆత్మగౌరవం అమ్ముకున్నట్లేనని అన్నారు. పాలమూరు బిడ్డనైనా నాకు సోనియాగాంధీ పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చింది. రాష్ట్రంలోని 119 మందికి బీఫాంలు ఇచ్చే అవకాశం దక్కింది. పీసీసీ పదవి నాది కాదు మీది. నన్ను సంపుకుంటారో సాదుకుంటారో మీ చేతుల్లోనే ఉంది. జిల్లాలో ఉన్న 14 అసెంబ్లి, 2 ఎంపీ సీట్లను గెలిపించి సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. సభలో మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యేలు ఎర్ర శేఖర్, రామ్మోహన్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మధుసుదన్రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.