- యువతలో గుండెపోటు, కోవిడ్ కు మధ్య సంబంధంపై అధ్యయనానికి ప్రభుత్వం ఆదేశం
- రెండు, మూడు నెలల్లో నివేదిక వస్తుందని మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడి
- కోవిడ్ కేసుల పెరుగుదలను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు సిద్ధంమని ప్రకటన
అనన్య న్యూస్: ఇటీవల కాలంలో యువత కూడ గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ స్పందించారు. మంగళవారం ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు. యువతలో గుండెపొటు కేసులకు, కొవిడ్కు ఏదైనా సంబంధం ఉందా అని తేల్చేందుకు ప్రభుత్వం ఓ అధ్యయనానికి ఆదేశించిందని, దీని తాలుకు ఫలితం రెండు, మూడు నెలల్లో వస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఎందరో యువ ఆర్టిస్టులు, అథ్లెట్లు, క్రీడాకారులు అకస్మాత్తుగా కుప్పకూలిన ఘటనలు మనం చూశాం. ఈ ఘటనలపై కచ్చితంగా అధ్యయనం చేయాలి అని మంత్రి వ్యాఖ్యానించారు.
ఇక దేశంలో మొత్తం 214 కరోనా వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నట్టు మంత్రి తెలిపారు. వీటిల్లో కొన్ని ఉపవేరియంట్ల కారణంగా ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఈ వేరియంట్లేవీ భారీ సంక్షోభాలు కలిగించేంతటి ప్రమాదకరమైనవి కావని ఆయన స్పష్టం చేశారు. ఇక కేసుల్లో పెరుగుదలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి భరోసా ఇచ్చారు. ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్, ఇతర అత్యవసర ఏర్పాట్లు అన్నీ రెడీగా ఉన్నాయని వివరించారు.