అనన్య న్యూస్, హైదరాబాద్: బిజెపికి కొత్త అర్థం చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బిజెపి అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని విమర్శించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఆదివారం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంకల్ప్ సత్యాగ్రహాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రిటిష్ విధానాలనే బిజెపి అమలు చేస్తుందని మండిపడ్డారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే హైదరాబాద్ కి స్వతంత్రం వచ్చేది కాదని అమిత్ షా అంటున్నాడని వల్లభాయ్ పటేల్ కి మీపార్టీకి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ నాయకుడని అన్నారు. ఆర్ఎస్ఎస్ ని నిషేధించింది కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ అని పేర్కొన్నారు.
గాంధీ భవన్ కి పునాది వేసింది కూడా వల్లభాయ్ పటేల్ అని అన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడింది కర్ణాటకలో అయితే గుజరాత్ లో కేసు ఎలా వేస్తారని ప్రశ్నించారు. అదానీ దోపిడీపై పార్లమెంటులో మోడీని రాహుల్ గాంధీ కడిగేసారని దాంతో రాహుల్ గాంధీని చూడాలంటేనే మోడీకి భయం పట్టుకుందన్నారు. అదాని కంపెనీలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది ఎవరో తేలాలన్నారు. అదానిపై ఈడి విచారణ జరగాలంటే మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. భగత్సింగ్ వారసుడిగా రాహుల్ ఎవరికీ తలవంచరు, క్షమాపణలు చెప్పరని రేవంత్ తేల్చిచెప్పారు. మరో స్వాతంత్ర్య ఉద్యమం చేయాల్సిన బాధ్యత యువతపై ఉన్నదన్నారు.